
స్పోర్ట్స్ డెస్క్: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపిన ఐపీఎల్ 2025 సీజన్ మే 17న తిరిగి ప్రారంభం కానుంది. బెంగళూరులో జరిగే RCB vs KKR మ్యాచ్తో టోర్నీ మళ్లీ మొదలుకానుండగా, ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశారు.
పహల్గామ్ దాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషాద సమయంలో ఐపీఎల్లో ఎలాంటి ఆర్భాటాలు, హంగామాలు వద్దని గవాస్కర్ స్పష్టం చేశారు.
“ఇప్పటికే 60కి పైగా మ్యాచ్లు పూర్తయ్యాయి. మిగిలిన మ్యాచ్లు కేవలం ఆటపైనే దృష్టి సారించాలి. ఈ సమయంలో వినోద కార్యక్రమాలు, డీజేలు, డ్యాన్సింగ్ గర్ల్స్ అవసరం లేదు,” అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
ఆటను ప్రేమించే ప్రేక్షకులకు ఆటే సరిపోతుందని, మిగతా ఆర్భాటాలు మృతుల కుటుంబాలను బాధించొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సూచనకు క్రికెట్ అభిమానుల నుండి మద్దతు లభిస్తోంది.
బీసీసీఐ ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందా అన్నది చూడాలి. అయితే గవాస్కర్ వ్యాఖ్యలు దేశంలో గౌరవ భావన కలిగించేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.