
న్యూస్ డెస్క్: సాయుధ దళాల్లో ‘నారీ శక్తి’ని పెంచే దిశగా భారత సైన్యం మరో కీలక అడుగు వేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద, మొట్టమొదటిసారిగా మహిళలను టెరిటోరియల్ ఆర్మీ (TA)లోకి చేర్చుకోవాలని పరిశీలిస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు.
టెరిటోరియల్ ఆర్మీ అనేది సాధారణ సైన్యానికి సహాయక విభాగం. ఇది దేశానికి సేవ చేయాలనుకునే వాలంటీర్లకు అవకాశం కల్పిస్తుంది. 1948లో స్థాపించబడిన ఈ విభాగంలోకి ఇప్పటివరకు మహిళలకు ప్రవేశం లేదు.
తాజా నిర్ణయంతో, తొలుత ఎంపిక చేసిన కొన్ని బెటాలియన్లలో మహిళా కేడర్లను నియమించనున్నారు. ఇది సైన్యంలో లింగ సమానత్వం వైపు వేసిన ముందడుగుగా భావిస్తున్నారు.
ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో 50,000 మంది సిబ్బంది ఉన్నారు. వీరు 1962, 1965, 1971 యుద్ధాలతో పాటు, ‘ఆపరేషన్ పవన్’ (శ్రీలంక), ‘ఆపరేషన్ రక్షక్’ (J&K) వంటి అనేక కీలక ఆపరేషన్లలో చురుకైన పాత్ర పోషించారు.
ప్రస్తుతం మహిళలు ఆర్మీలోని ఇంజినీర్స్, ఎయిర్ డిఫెన్స్, సిగ్నల్స్, ఏవియేషన్, మెడికల్ సర్వీసెస్ వంటి 10 విభాగాల్లో సేవలందిస్తున్నారు. ఇప్పుడు టీఏలో కూడా వారి ప్రవేశానికి మార్గం సుగమం కానుంది.
