
భారత్ బిగ్ ప్లాన్స్: పొరుగు దేశాలపై ఆధారపడకుండా ‘స్వయం సమృద్ధి’!
న్యూస్ డెస్క్: ప్రపంచం అనిశ్చితితో ఉన్నప్పుడు, ఏ ఒక్క దేశం మీద పూర్తిగా ఆధారపడకూడదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. కోల్కతాలోని ఐఐఎమ్ వేదికగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు ఆర్థికం కంటే రాజకీయమే డామినేట్ చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
అగ్రరాజ్యం అమెరికా, పొరుగున ఉన్న చైనా వ్యవహారశైలిని జైశంకర్ పరోక్షంగా ప్రస్తావించారు. అమెరికా కొత్త నిబంధనలతో డీల్స్ కుదుర్చుకుంటే, చైనా తన సొంత రూల్స్తో ఆట ఆడుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో మన దేశ అవసరాల కోసం సరఫరా దారులను మార్చుకోవడం ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం చాలా ముఖ్యమని ఆయన సూచించారు. భారత్ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.
గత దశాబ్ద కాలంలో ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా మన ఆలోచనా విధానం మారింది. ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడిన మనం, ఇప్పుడు సొంతంగా తయారు చేసుకునే స్థాయికి ఎదుగుతున్నాం. పారిశ్రామిక వృద్ధికి ఊతమివ్వడం ప్రధాన ఆర్థిక ఎజెండాగా మారింది.
మౌలిక సదుపాయాల విషయంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రపంచం గమనిస్తోంది. హైవేలు, రైల్వేలు, పోర్టులు, ఎనర్జీ సెక్టార్లలో వేగంగా దూసుకెళ్తున్నాం. దీంతో ఆసియాలోని ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలతో మనకు ఉన్న అంతరం తగ్గుతోంది.
భవిష్యత్తు టెక్నాలజీదే. సెమీకండక్టర్లు, చిప్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డ్రోన్లు వంటి అడ్వాన్స్డ్ రంగాల్లో భారత్ వెనుకబడి లేదు. 2047 నాటికి ‘విక్షిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యంగా పనిచేస్తున్నామని జైశంకర్ తెలిపారు.
