
న్యూస్ డెస్క్: ఉద్యోగం అంటే ఈ రోజుకీ ప్రభుత్వ కొలువే అనే బలమైన నమ్మకం సమాజంలో ఉంది. జీవితాంతం భరోసా స్థిరత్వం కోసం కోరుకునే ఈ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏ స్థాయిలో ఉన్నారో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ వెల్లడించింది.
అసిస్టెంట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల నియామకం కోసం బీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఖాళీలు కేవలం 935 మాత్రమే. కానీ ఆశ్చర్యకరంగా వీటికి 9.7 లక్షల దరఖాస్తులు వచ్చిపడ్డాయి.
అంటే దాదాపు ఒక పోస్టుకు వేయి మంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారన్న మాట. గడువు ముగుస్తున్న చివరి ఐదు రోజులలోనే రోజుకు సగటున 75 వేల నుంచి 85 వేల దాకా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.
ఈ పోస్టుకు లెవెల్ 5 పే కమిషన్ ప్రకారం రూ. 29,200 నెల జీతం లభిస్తుంది. మొత్తం 935 పోస్టులలో 319 మహిళలకు, మరికొన్ని వికలాంగులకు రిజర్వ్ అయ్యాయి. ఓపెన్ కేటగిరీలో చాలా తక్కువ పోస్టులు ఉన్నా లక్షల దరఖాస్తులు వచ్చాయి.
ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్న నేపథ్యంలో స్థిరత్వం కోసమే అంతా చూస్తున్నారు. ఐటీ రంగంలో జాబ్స్ తగ్గిపోవడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం పెరగడం వంటి కారణాల వల్ల జీతం తక్కువ అయినా భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
దీనిని మన చదువులు స్వయం ఉపాధికి ధీమా ఇవ్వలేకపోతున్నాయా? లేక నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో తెలియజేసే గణంకమా? అనేది ఆలోచించాల్సిన విషయం.
