
న్యూస్ డెస్క్: తెలంగాణలో వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి ఉత్తమ్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ అధికారులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి విపత్తు పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించాలని ఆదేశించారు.
భారీ వర్షాల దృష్ట్యా అన్ని విభాగాల ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలు, చెరువులపై నిఘా పెంచాలని సూచించారు.
ప్రాంతీయ స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఉత్తమ్ ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, ఇతర విభాగాల అధికారులతో సమన్వయం తప్పనిసరి అని చెప్పారు.
ఈ ఆదేశాలను నీటిపారుదల శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్, ఈఎన్సీ అంజాద్ హుస్సేన్లకు పంపించారు. సీఈలు కూడా ఈ సూచనలను అమలు చేయాలని స్పష్టం చేశారు.
అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే వర్షాల ప్రభావాన్ని తగ్గించవచ్చని మంత్రి అన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను పాటించాలని పిలుపునిచ్చారు.
