
న్యూస్ డెస్క్: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన 56వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. పండగ సీజన్ దృష్ట్యా వినియోగదారులకు ధరల పరంగా ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అమల్లో ఉన్న 5, 12, 18, 28 శాతం అనే నాలుగు స్లాబులను రద్దు చేసి, వాటి స్థానంలో రెండు స్లాబులను మాత్రమే అమలు చేసే ప్రతిపాదన ప్రధాన చర్చగా నిలిచింది. వస్తువులు, సేవలను “మెరిట్” మరియు “స్టాండర్డ్” కేటగిరీలుగా విభజించి కొత్త పన్ను రేట్లు విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీని వల్ల సాధారణ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది.
చిన్న కార్లు, 350సీసీ లోపు బైక్స్, నిత్యావసర వస్తువులు, హోటల్ గదులు, సినిమా టికెట్లు చౌక కాబోతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ మందులపై పన్ను పూర్తిగా రద్దు చేసే అవకాశమూ ఉంది.
ఇక లగ్జరీ ఈవీలు, ఖరీదైన దుస్తులు, పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ కార్లపై పన్ను భారం పెరగనుంది. ఈ విభాగాలపై 18 నుంచి 40 శాతం వరకు పన్నులు పెరగనున్నాయి.
ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.50 వేల కోట్లు ఆదాయం తగ్గినా, వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
