
న్యూస్ డెస్క్: రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, వారికి ఒక సొంతూరు ఉంటుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో ఎన్నికల సందడి నెలకొంది.
ఆరేళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇవి జరగడం వంటి అనేక పరిణామాల మధ్య ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీ రహితంగా జరిగినా, చివరికి ఏ పార్టీ మద్దతుదారులు గెలిచారనే లెక్కలు చూస్తారు.
కొండారెడ్డిపల్లి గ్రామ జనాభా 3 వేల వరకు ఉంటుంది. రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న ఈ పంచాయతీ.. ఈసారి రిజర్వేషన్ల భాగంగా ఎస్సీ రిజర్వ్ అయ్యింది.
ఈ నేపథ్యంలో కొండారెడ్డిపల్లి సర్పంచ్ పదవికి మల్లెపాకుల వెంకటయ్య (మోహన్) ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంకటయ్య గతంలో హోంగార్డుగా పనిచేశారు.
వెంకటయ్య మొదటినుంచి రేవంత్ రెడ్డి కుటుంబానికి దగ్గరగా ఉంటూ, అనుచరుడిగా కొనసాగుతున్నారు. గ్రామస్థులంతా ఈ మేరకు తీర్మానించినట్లు తెలుస్తోంది.
సర్పంచ్ పదవితో పాటు, వార్డు సభ్యుల పదవులకు కూడా ఒక్కొక్క నామినేషనే దాఖలయ్యేలా చూసి, ఏకగ్రీవం చేసి ఆదర్శంగా నిలిచే ప్రయత్నాల్లో కొండారెడ్డిపల్లి ఉంది.
