
న్యూస్ డెస్క్: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజోలు నియోజకవర్గ పర్యటనలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడం వివాదానికి దారి తీసింది. జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
అయితే ఈ విషయంపై వైసీపీ స్పందన ఆసక్తికరంగా మారింది. పవన్ పర్యటన అట్టర్ ప్లాప్ కావడం వల్లే, టాపిక్ను డైవర్ట్ చేయడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తితో మాట్లాడించి ఆ వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఆ వ్యక్తి తాను ప్రస్తుతం జనసేన కార్యకర్తగా పనిచేస్తున్నట్లు చెప్పడం గమనార్హం.
“తీరా చూస్తే ఆ అపరిచిత వ్యక్తి జనసైనికుడే అని తేలిపోయింది. సొంత పార్టీ కార్యకర్తలను చూసి పవన్ భయపడే పరిస్థితి రావడం బాధాకరం” అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
అయితే సొంత కార్యకర్త పర్యటనకు వస్తే జనసేన కార్యకర్తలు ఎందుకు అంత టెన్షన్ పడతారనేది ప్రశ్న. అనుమానితుడు పవన్ కు అత్యంత సమీపంలో తిరగడం వల్లే ఆందోళనకు గురయ్యారని అంటున్నారు.
దీనితో ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఎవరైనా తప్పుదారి పట్టించారా అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి ఒక చిన్న అవగాహన లోపం తీవ్ర రాజకీయ కలకలానికి కారణమైంది.
