
తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించారని గుర్తించి, సుమారు 75 వేల రూపాయల ఫైన్లు విధించినట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గత ఆరు నెలల్లో ఈ కాన్వాయ్ వాహనాలు 18 సార్లు నిబంధనలు ఉల్లంఘించాయని సీసీ కెమెరాలు రికార్డు చేశాయి. వాటిలో ముఖ్యంగా రెడ్ సిగ్నల్ దాటడం, వేగ పరిమితి అతిక్రమించడం, అవసరం లేకుండానే వాహనాలు ప్రయాణించడం ప్రధాన కారణాలుగా గుర్తించారు.
సాధారణంగా సీఎం లేకుండా కాన్వాయ్ వాహనాలు తిరగరాదు. అయితే, అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా ఈ వాహనాలు తిరిగినట్లు పోలీసుల నివేదిక చెబుతోంది. దీనివల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగినట్లు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఈ జరిమానాల వివరాలను సీఎంవోకు పంపించారు. తీవ్రంగా ఉన్న 18 ఉల్లంఘనలకు మాత్రమే జరిమానాలు విధించగా, చిన్న తప్పులను లైట్ తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, రేవంత్ రెడ్డి గతంలోనే “నియమాలు అతిక్రమిస్తే, నేను చేసినా జరిమానా కట్టాలి” అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అదే పరిస్థితి ఇప్పుడు తనకే వర్తించడం హైలైట్గా మారింది.
