
న్యూస్ డెస్క్: కేంద్రంలో మంత్రి వర్గ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తైన వెంటనే, అక్టోబర్ మొదటి వారంలో ఈ ప్రక్రియ జరుగనుందని సమాచారం. బీహార్, తమిళనాడు ఎన్నికల దృష్ట్యా ఆ రాష్ట్రాల నేతలకు పదవులు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మరో కీలక పదవి ఇవ్వాలని కూడా చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఏపీ నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు. వీరిలో బీజేపీకి చెందిన భూపతిరాజు శ్రీనివాసవర్మ ఒకరైతే, టీడీపీ తరఫున కింజరాపు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే కీలక మంత్రిత్వ శాఖల్లో ఉన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలకు ప్రాతినిధ్యం దక్కింది. ఈ నేపథ్యంలో సీమ నుంచి కూడా ఒక ఎంపీకి మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
అనంతపురం, చిత్తూరు ఎంపీలు ఈ రేసులో ఉన్నారని సమాచారం. హిందూపురం ఎంపీ కూడా ప్రయత్నాలు చేస్తున్నా, ఎస్సీ వర్గానికి చెందిన నేతకు లేదా కీలక సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి ఈ అవకాశమివ్వాలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మోడీ కూడా ఏపీతో సాన్నిహిత్యం పెంచుకోవాలనే ఆలోచనలో ఉండటంతో, ఈసారి సీమకు న్యాయం చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు స్పష్టత రాకపోయినా, ఈ సారి సీమ నుంచి ఒక ఎంపీకి కీలక పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
చంద్రబాబు వ్యూహం ప్రకారం, మూడు ప్రాంతాల నుంచి సమాన ప్రాతినిధ్యం కలిగించేలా ఈ మార్పులు జరుగవచ్చని అంచనా. దీంతో రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణపై సీమ వర్గాలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి.
