
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కుల గణనపై చర్చలు ముదురుతున్న వేళ, AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. 2021 నుంచి తాను కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ వస్తున్నానని గుర్తుచేసిన ఆయన, ఇది చాలా కాలంగా వాయిదా పడుతున్న హక్కుతో కూడిన డిమాండ్ అని పేర్కొన్నారు.
ఇది స్వతంత్ర భారతదేశంలో తొలి ప్రయత్నమని, దీనికి కార్పోరేట్ శక్తుల నుంచి రాజకీయ ప్రయోజనాల కోసం వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ, వెనుకబడిన వర్గాలకు న్యాయమైన వాటా లభించాలంటే కుల గణన తప్పదని స్పష్టం చేశారు. దళిత ముస్లింలకు ఎస్సీ హోదా, వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు అవసరమని ఆయన హితవు పలికారు.
ఇదిలా ఉండగా, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కుల గణనకు తాము వ్యతిరేకం కాదని చెబుతూ, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల గణన సర్వేను తప్పులతడకగా అభివర్ణించిన ఆయన, కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కుల గణన శాస్త్రీయంగా, సమగ్రంగా ఉంటుందని చెప్పారు.
ఈ గణనతో కులాల వారీగా ఖచ్చితమైన జనాభా లెక్కలు లభిస్తాయని, రిజర్వేషన్లలో న్యాయం జరిగే దిశగా ఇది ముందడుగు అవుతుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.