
న్యూస్ డెస్క్: నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా తన ప్రత్యేకతను మరోసారి చూపించారు. సినిమాలతో బిజీగా ఉన్నా కూడా తన నియోజకవర్గం హిందూపురం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో హిందూపురంలో స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్సీడీపీ) సాధించారు.
ఈ ప్రాజెక్ట్ వల్ల వందలాది చేనేత కుటుంబాలకు ఉపాధి లభించనుంది. ఆధునిక డిజైన్లలో దుస్తుల తయారీపై శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. చేనేత శాఖ మంత్రి సవిత సాక్షిగా అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగి నిర్ణయం తీసుకున్నారు.
292 మంది నేతన్నలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరేలా ఈ ప్రాజెక్ట్ అమలు కానుంది. రూ.1.51 కోట్ల బడ్జెట్లో కేంద్రం ప్రధాన భాగాన్ని ఇస్తుంది. లబ్ధిదారుల నుంచి కూడా కొంత వాటా తీసుకుంటారు. దీని వల్ల చేనేత రంగంలో ఆధునికత పెరుగుతుందని భావిస్తున్నారు.
బాలయ్య స్వయంగా మంత్రి సవితను కలసి హిందూపురం కోసం ఈ ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. నేతన్నలు ఫ్యాషన్ డిజైనర్లతో కలిసి కొత్త మోడర్న్ చేనేత దుస్తులను తయారు చేయడానికి శిక్షణ పొందుతారు.
ఇక ఈ ప్రాజెక్ట్ వల్ల గ్రామీణ స్థాయిలోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చేనేత కుటుంబాలు గౌరవప్రదమైన జీవితం గడపగలుగుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.
హిందూపురం అభివృద్ధి పట్ల బాలయ్య చూపుతున్న శ్రద్ధ ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా ఆయనపై గర్వపడుతున్నారు.
