తెలంగాణలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం నూతన పథకంతో ముందుకొస్తోంది. ‘బాల భరోసా’ పేరిట కొత్త సంక్షేమ పథకాన్ని త్వరలో అమలులోకి తీసుకొస్తామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ పథకం ఐదేళ్లలోపు పిల్లలకు ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యంగా రూపొందించబడింది.
మంగళవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన మంత్రి సీతక్క, చిన్నారులకు అన్నిరకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తామని తెలిపారు. అనారోగ్య పరిస్థితుల్లో అవసరమైతే శస్త్రచికిత్సలు కూడా ప్రభుత్వమే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు.
బాల భరోసా అమలుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది చిన్నారులకు మేలు చేకూరనుంది. ముఖ్యంగా బడుగు, బలహీన తరగతులకు చెందిన తల్లిదండ్రులకు ఇది ఆర్థికంగా భారీ ఊరటనిచ్చే పథకంగా మారనుంది.
ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చులు భరించలేని కుటుంబాలకు ఈ పథకం వరంగా నిలవనుంది. చిన్నపిల్లల ఆరోగ్యమే భవిష్యత్తు బలం అనే దృష్టితో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఇక త్వరలోనే ఈ పథకం గురించి పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసి, అధికారికంగా అమలు మొదలుపెట్టనుంది.