
ఆంధ్రప్రదేశ్: కూటమి ప్రభుత్వం పెట్టుబడుల వేటలో మరో మెట్టు ఎక్కింది. అమరావతిలో దేశపు తొలి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు క్రియేటివ్ల్యాండ్ ఆసియాతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
‘క్రియేటర్ల్యాండ్’ పేరుతో రూపొందనున్న ఈ ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్ ద్వారా ఏపీలో 25 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా, స్థానిక టాలెంట్ను ప్రోత్సహించేలా ఉండబోతుంది.
ఈ సిటీ చిత్ర పరిశ్రమ, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, ఏఐ ఆధారిత కంటెంట్ తయారీ వంటి విభాగాలకు కేంద్రంగా మారనుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు ఇంటర్నేషనల్ భాగస్వామ్యాలు కూడా ఇందులో భాగంగా ఉండనున్నాయి.
ఈ ప్రాజెక్ట్లో ఓ ప్రత్యేక అకాడమీ కూడా ఏర్పాటవుతోంది. యువతకు నైపుణ్యాలను అందించేందుకు, వారికి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు ఈ అకాడమీ కేంద్రబిందువుగా మారనుంది.
ఇది అమరావతిని సృజనాత్మక రంగాల్లో హబ్గా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన తొలి బలమైన అడుగుగా చెప్పొచ్చు.