
న్యూస్ డెస్క్: తెలంగాణ పర్యటనకు వచ్చిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎక్కువగా గడపడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా అఖిలేష్ ఇండియా కూటమిలో మిత్రుడుగా ఉన్నప్పటికీ, కేటీఆర్ తో సాన్నిహిత్యంపై చర్చ జరుగుతోంది.
అఖిలేష్ యాదవ్ మొదట సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ, ఆ తర్వాత సమయాన్ని అంతా కేటీఆర్ తోనే గడిపారు. వీరిద్దరూ కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అఖిలేష్ ఆశలు కల్పించారు.
రెండో రోజు కూడా ఈ ఇద్దరూ స్నేహితులుగా కలిసి హైదరాబాద్లోని రామేశ్వరం కేఫ్లో భోజనం చేశారు. భోజనం రుచులను ఆస్వాదిస్తూనే, వర్తమాన రాజకీయాల గురించి చర్చించుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ ఇంటికి కూడా ఇద్దరూ కలిసి వెళ్లారు.
స్థానికంగా కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న సమయంలో, ఇండియా కూటమి మిత్రుడుగా ఉన్న ఎస్పీ అధినేత కేటీఆర్ తో ఇంత స్నేహంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎస్పీ, కాంగ్రెస్ యూపీలో మిత్రులుగా ఉన్నప్పటికీ, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ ను బలంగా విమర్శిస్తోంది.
ఈ కొత్త చెలిమి వెనుక వేరే ప్లాన్ ఉందా అనే చర్చ నడుస్తోంది. ఇండియా కూటమిలోకి బీఆర్ఎస్ ను తీసుకురావడానికి అఖిలేష్ ప్రయత్నిస్తున్నారా, లేక తెలంగాణలో ఎస్పీ విస్తరించే క్రమంలో బీఆర్ఎస్ ను మంచి మిత్రుడిగా చేసుకోవాలని చూస్తున్నారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
