
న్యూస్ డెస్క్: ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రాక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 13న నగరంలో అడుగుపెట్టబోతున్న మెస్సీ, మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు.
మెస్సీని కలవాలని, ఆయనతో ఫోటో దిగాలని కలలు కనే అభిమానుల కోసం నిర్వాహకులు ఒక అవకాశం కల్పించారు. అయితే ఈ అవకాశం ఫ్రీ కాదు. మెస్సీతో కలిసి ఫోటో దిగాలంటే అక్షరాలా రూ. 9.5 లక్షలు (జీఎస్టీతో కలిపి రూ. 10 లక్షలు) చెల్లించాల్సిందే. ఈ కాస్ట్లీ అవకాశం కేవలం వంద మందికి మాత్రమే అని నిర్వాహకులు తెలిపారు.
ఈ టూర్ వివరాలను గోటూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతి రెడ్డి వెల్లడించారు. మెస్సీ 13వ తేదీ సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లి సింగరేణి 9 టీమ్ తో కలిసి అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్టుకు వ్యతిరేకంగా 20 నిమిషాల పాటు జరిగే ఫుట్ బాల్ మ్యాచ్ లో పాల్గొంటారు.
ఈ మ్యాచ్ లో చివరి 5 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫుట్ బాల్ ఆడుతారు. మెస్సీతో పాటు అర్జెంటీనాకు చెందిన రోడ్రిగో డీపాల్, లూయిస్ సువారెజ్ కూడా వస్తున్నారు. మ్యాచ్ అనంతరం మెస్సీ చిన్న పిల్లలకు ఫుట్ బాల్ మెలకువలు నేర్పిస్తారు.
ప్రపంచ కప్ విజేతగా మెస్సీ భారత్ కు రావడం ఇది రెండోసారి. పీలే, మారడోనా వంటి దిగ్గజాలను గతంలో భారత్ కు రప్పించిన శతడ్రు దత్తా, రెండేళ్ల ప్రయత్నం తర్వాత మెస్సీని ఇక్కడికి తీసుకురాగలిగారు.
