
న్యూస్ డెస్క్: విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టడానికి రావడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరించిన పక్కా వ్యూహం ఉంది. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అన్నింటికంటే ముందు శాంతి భద్రతలు (లా అండ్ ఆర్డర్) పటిష్టంగా ఉండాలన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం.
ప్రపంచంలోని ఏ దిగ్గజ సంస్థ అయినా, వేల కోట్లు పెట్టుబడిగా పెట్టే ముందు లాభాల కంటే ఎక్కువగా తమ పెట్టుబడులకు భద్రతను కోరుకుంటుంది. ఎక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుందో, అక్కడికే పరిశ్రమలు తరలివస్తాయి. ఈ సూత్రాన్ని చంద్రబాబు మొదటి నుంచీ బలంగా నమ్ముతారు.
అందుకే, ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచే శాంతి భద్రతల పరిరక్షణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఒకప్పుడు ఫ్యాక్షనిజం, అశాంతితో పేరుబడ్డ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు “కూలెస్ట్” స్టేట్గా మారుతోందన్న ప్రచారం జరగడం వల్లే గూగుల్ వంటి సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయి. ఈ మార్పుకు చంద్రబాబు అనుభవజ్ఞులైన పాలనే కారణం.
ఈ విజయం వెనుక ఏపీ పోలీసుల సమర్థవంతమైన పనితీరు ఉందని చంద్రబాబు స్వయంగా కొనియాడారు. పోలీసు అమరవీరుల దినోత్సవం నాడు, రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయన్న భరోసా కల్పించడం వల్లే ఈ పెట్టుబడులు సాధ్యమయ్యాయని ఆయన అన్నారు.
మొత్తం మీద, గూగుల్ రాక అనేది కేవలం ఒక పెట్టుబడి ఒప్పందం కాదు.. ఇది చంద్రబాబు పరిపాలనా దక్షతకు, ముఖ్యంగా ‘లా అండ్ ఆర్డర్’ విషయంలో ఆయన కఠిన వైఖరికి లభించిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు.
