
న్యూస్ డెస్క్: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా పాల్గొననున్న ‘ఏఎక్స్-4’ అంతరిక్ష ప్రయోగం మరోసారి వాయిదా పడింది. ముందుగా జూన్ 19న జరగాల్సిన ఈ మిషన్ను తాజా పరిణామాల నేపథ్యంలో జూన్ 22కి మార్చినట్లు యాక్సియమ్ స్పేస్ అధికారికంగా ప్రకటించింది.
అత్యవసర మరమ్మతులు, వాతావరణ పరిస్థితులు, సిబ్బంది ఆరోగ్య అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ప్రయోగం జరగనుంది.
ఈ మిషన్లో శుభాన్షుతో పాటు హంగేరీ, పోలండ్ దేశాలకు చెందిన వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లనున్నారు. శుభాన్షు శుక్లా పైలట్ పాత్రలో వ్యవహరించనుండటం విశేషం.
ప్రైవేట్ రోదసి ప్రయోగం ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లే తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్ర సృష్టించనున్నారు. గతంలో రాకేశ్ శర్మ చేసిన ఘనతను మళ్లీ భారతం అందుకోనుండటం గర్వకారణం.
ఈ మిషన్ మే 29 నుంచే వాయిదాల మీద కొనసాగుతోంది. తాజా నిర్ణయంతో శుభాన్షు యాత్ర కోసం దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగింది.