
ఏపీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఒకసారి మరలా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ పేరుతో చంద్రబాబు పాలన ప్రజాస్వామ్య విలువలను పాతర వేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను రాజకీయ అవసరాల కోసం వాడుతున్నారని ఆరోపించారు.
శనివారం మీడియాతో మాట్లాడిన సజ్జల, “ఎన్నికల ముందు చెప్పినట్టు ‘రెడ్ బుక్ పాలన’ను అమలు చేస్తున్నారు. ఇది ఊహించని స్థాయికి వెళ్లిపోయింది” అని అన్నారు. సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన కేసు దీనికి ఉదాహరణగా చెప్పారు.
తప్పుడు కథలతో కేసులు బనాయించి, మీడియా ద్వారా ప్రజల్లో విష ప్రచారం చేసి, తర్వాత అరెస్టులు చేయడమే ప్రభుత్వం చేస్తున్న దుశాసన రాజకీయం అని విమర్శించారు. సోషల్ మీడియా కార్యకర్తల నుంచి నేతల వరకూ ఈ అణచివేత సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి చర్యల వల్ల కార్యకర్తలు, నాయకులు మరింత ధైర్యంగా ఎదుగుతున్నారని తెలిపారు. జైలు వెళ్లిన నేతలు బయటికి వచ్చిన తర్వాత మరింత పోరాట సిద్ధంగా మారుతున్నారని వివరించారు.
పోలీసు వ్యవస్థ గాడితప్పిందని, కొంతమంది అధికారులు అధికార పార్టీ తాబేదారులుగా మారారని ఆరోపించిన సజ్జల, తెనాలి, కావలిలో జరిగిన ఉదంతాలను ఉదహరించారు.