
తెలంగాణ: భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ప్రతిపాదించారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న భారత సైనిక దళాలకు సంఘీభావం తెలుపుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇవ్వాలని సూచించారు.
పాకిస్థాన్ దుందుడుకు చర్యలపై ధైర్యంగా ప్రతిఘటిస్తున్న సైనికులకు అండగా ఉండడం ప్రతి పౌరుడి కర్తవ్యమని రేవంత్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చర్చలు జరిపి త్వరలో ప్రకటన చేయనున్నారు.
ఇది కేవలం కాంగ్రెస్ పరిమితి కానని, అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందించాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని కోరారు.
సైనికుల ధైర్యసాహసానికి నివాళి అర్పించడంలో తెలంగాణ ముందుండాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల్లో ఈ ప్రకటన పాజిటివ్ స్పందన కలిగిస్తోంది.