
న్యూస్ డెస్క్: అమెరికాలో గ్రీన్ కార్డు కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వలసదారులకు త్వరలో శుభవార్త అందే అవకాశముంది. అమెరికా ప్రభుత్వం ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజుతో గ్రీన్ కార్డు దరఖాస్తులను త్వరగా పరిశీలించే అవకాశం కల్పించేందుకు కొత్త బిల్లును సిద్ధం చేసింది.
ఈ బిల్లు డిగ్నిటీ యాక్ట్ ఆఫ్ 2025 పేరుతో త్వరలో చట్టసభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకూ భారత్, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ వంటి దేశాల వలసదారులు కోటా పరిమితి వల్ల సంవత్సరాల పాటు వేచి ఉండాల్సి వస్తోంది.
ప్రస్తుత విధానం ప్రకారం ఒక్కో దేశానికి కేవలం 7% కార్డులు మాత్రమే కేటాయించగా, కొత్త బిల్లులో ఇది 15%కి పెంచే ప్రతిపాదన ఉంది.
పదేళ్లుగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నవారు ప్రత్యేక ప్రాసెసింగ్ ఫీజు ($20,000) చెల్లిస్తే, వారి దరఖాస్తును అధికారులు త్వరగా పరిశీలిస్తారు. దీంతో ఇకపైనా ఎక్కువ కాలం నిరీక్షణ ఉండదని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఫ్యామిలీ ప్రిఫరెన్స్ ద్వారా ఏడాదికి 2,26,000 గ్రీన్ కార్డులు, ఉద్యోగాల ద్వారా 1,40,000 కార్డులు జారీ అవుతాయి. అయితే, దేశవారీ పరిమితిని పెంచే ప్రతిపాదన వల్ల భారతీయులకు, ఇతర దేశాల వారికి గ్రీన్ కార్డు ఆశలు వేగంగా నెరవేరే అవకాశముంది.
