
న్యూస్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణంలో, ఆయన చేపట్టిన “ఓటర్ అధికార్ యాత్ర”లో భాగంగా సీతామఢీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బిహార్ రాష్ట్రంలో సుమారు 65 లక్షల ఓటర్ల పేర్లను జాబితా నుంచి అక్రమంగా తొలగించారని ఆరోపించారు. ఇది ఓట్ల దొంగతనం కిందకే వస్తుందని ఆయన స్పష్టం చేశారు. తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం బడుగు, బలహీన వర్గాలవే అని ఆరోపిస్తూ, ఇది నేరుగా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్య అని వ్యాఖ్యానించారు.
“బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఓట్లను దొంగిలిస్తున్నాయి. గతంలో మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకల్లో ఇదే పద్ధతి చూశాం. ఇప్పుడు బిహార్ లక్ష్యంగా మారింది. కానీ ప్రజలు తమ ఓటు హక్కును దోచుకోనివ్వరు” అని రాహుల్ గాంధీ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలు బయట పెడతానని కూడా తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దొంగ ఓట్లతోనే ఏర్పడిందని, ప్రధాని మోదీ కూడా ఈ ఓట్ల తస్కరణలో పాలుపంచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. “కొంతమంది పారిశ్రామిక వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ కుట్ర” అని రాహుల్ మండిపడ్డారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ అధికార్ యాత్ర 16 రోజులపాటు 1300 కిలోమీటర్ల మేర సాగనుంది. వచ్చే నెల 1న పట్నాలో జరిగే భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగియనుంది.
