
అమరావతి: ఏపీలో సంక్రాంతి సెలవుల తరువాత సోమవారం నుంచి స్కూళ్లు కాలేజీలు పునఃప్రారంభం అవనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు పాటించేలా విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. పాఠశాలలు కోవిడ్ కారణంగా దాదాపు 5 నెలలు ఆలస్యంగా నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.
ఇప్పటికే పాఠశాలల్లో 9, 10 తరగతులు, జూనియర్ కాలేజీల్లో 12వ తరగతి విద్యార్థులను తల్లిదండ్రుల అనుమతితో భౌతిక దూరం పాటిస్తూ స్కూళ్లు, కాలేజీలకు అనుమతించారు. ఆ తర్వాత 6, 7, 8 తరగతుల వారికి కూడా తరగతులు ప్రారంభించారు. అయితే ప్రాథమిక పాఠశాలలను ఈ విద్యాసంవత్సరానికి ప్రారంభించాలా? వద్దా? అన్న అంశంపై విద్యాశాఖ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంది.
ఇదిలా ఉండగా టీచర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలను సంక్రాంతి సెలవుల్లో విద్యాశాఖ పూర్తిచేసింది. దాదాపు 76 వేల మంది టీచర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో సోమవారం నుంచి స్కూళ్లు కొందరు కొత్త టీచర్లతో ప్రారంభం కానున్నాయి. పాఠశాలల నిర్వహణకు సంబంధించిన క్యాలెండర్ను ఎస్సీఈఆర్టీ ఇప్పటికే ప్రకటించింది. పదో తరగతి విద్యార్థులు రోజూ తరగతులకు హాజరుకావాలని, ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో 7, 9వ తరగతి విద్యార్థులు, ప్రతి మంగళ, గురు, శనివారాల్లో 6, 8 తరగతుల విద్యార్థులు, గతంలో మాదిరిగానే తరగతులకు హాజరు కావాలని సూచించింది.
రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు స్కూళ్లు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి ఆన్లైన్ బోధనను కొనసాగించాలని ఎస్సీఈఆర్టీ ఆదేశించింది. సోమవారం నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు కూడా ప్రారంభించాలని అన్ని కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం పనిదినాలను 106కు తగ్గిస్తున్నారు.