
అంతర్జాతీయం: భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. భారత్ రాబోయే 24 నుంచి 36 గంటల్లో సైనిక చర్యకు దిగవచ్చని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి చేసిన ప్రకటన పెట్టుబడిదారుల మనోభావాలను కలకలం చేయించింది.
ఈ వ్యాఖ్యలతో బుధవారం పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చేంజ్ (PSX) మార్కెట్ భారీ నష్టాలను నమోదు చేసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కేఎస్ఈ-100 సూచీ 3,545 పాయింట్లు లేదా 3.09 శాతం పతనమై 111,326.58 వద్ద స్థిరపడింది. ఇది ఇటీవల కాలంలో నమోదైన అతిపెద్ద నష్టాల్లో ఒకటి.
ట్రేడింగ్ ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్యకు దిగవచ్చన్న హెచ్చరిక పెట్టుబడిదారులలో భయాన్ని పెంచినట్లు తెలుస్తోంది.
ఇస్మాయిల్ ఇక్బాల్ సెక్యూరిటీస్ సీఈఓ అహ్ఫాజ్ ముస్తఫా మాట్లాడుతూ, “మంత్రుల ప్రకటనలతో పెట్టుబడిదారులు ఈక్విటీల నుంచి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు” అని వ్యాఖ్యానించారు.
ఇక మరికొన్ని రోజులు భారత్ స్పందన ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత రాకముందే పాక్ మార్కెట్లో పునరుత్తేజం వచ్చే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.