
న్యూస్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ భారత్-చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనం, పరస్పర సున్నితత్వం అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ మాట్లాడుతూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు తాను జపాన్ నుంచి నేరుగా చైనాకు వెళ్లనున్నట్లు తెలిపారు. అక్కడ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారని చెప్పారు. గత ఏడాది కజాన్లో షీతో జరిగిన భేటీ తర్వాత ఇరు దేశాల సంబంధాల్లో సానుకూల మార్పులు కనిపించాయని గుర్తుచేశారు.
“భూమిపై అతిపెద్ద దేశాలు పొరుగున ఉన్న భారత్-చైనా స్నేహపూర్వకంగా ఉంటే, అది కేవలం రెండు దేశాలకు మాత్రమే కాదు, ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు కూడా ఎంతో మేలు చేస్తుంది” అని మోదీ అభిప్రాయపడ్డారు. ఆసియా, ప్రపంచ స్థాయిలో బహుళ ధ్రువ విధానం ఏర్పడటానికి ఇది కీలకమని చెప్పారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత కొనసాగుతున్న తరుణంలో భారత్-చైనా కలిసి పనిచేయడం అత్యవసరమని మోదీ పేర్కొన్నారు. ఆర్థిక క్రమానికి స్థిరత్వం తీసుకురావడంలో ఇరు దేశాల సహకారం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటించడం, ఇప్పుడు మోదీ చైనా వెళ్లడం రెండు దేశాల మధ్య సంబంధాలు కొత్త దశకు చేరినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే ఎస్సీఓ సదస్సులో ఈ అంశంపై మరిన్ని స్పష్టతలు రావచ్చని అంచనా.
