ఢిల్లీ: పాకిస్థాన్ సరిహద్దు ప్రవర్తనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎలాంటి కవ్వింపులు జరిగినా మౌనంగా ఉండవద్దని, శక్తివంతమైన ప్రతిస్పందన ఇవ్వాలని మోదీ తేల్చిచెప్పినట్లు ఏఎన్ఐ నివేదిక పేర్కొంది.
“వారు తూటా పేలిస్తే మనం బాంబు ప్రయోగించాలి” అన్న ఉద్దేశంతో సైన్యానికి దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆదేశాల నేపథ్యంలో భారత సాయుధ బలగాలు ఎల్ఓసీ పరిధిలో పూర్తి అప్రమత్తతతో కాపలా వహిస్తున్నాయి.
పాకిస్థాన్ మరోసారి కాల్పులకు దిగితే, అదే స్థాయిలో కాకుండా రెట్టింపు ప్రతిస్పందన ఇవ్వాలన్నది కేంద్ర ఆదేశం.
ఇప్పటికే భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో, సరిహద్దుల్లో భారత వైఖరి మరింత గట్టి మలుపు తీసుకున్నది. ప్రధాని ఆదేశాలతో మిస్సైళ్ల స్థాయిలో ఎదురుదాడులకు సైతం భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయి.
ఇవన్నీ పాక్కు బలమైన హెచ్చరికగా మారనున్నాయి. ఎలాంటి దుస్సాహసానికి ఆస్కారం లేదన్న స్పష్టమైన సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం పంపినట్లైంది. ఈ నేపథ్యంలో, భారత్ వైపు నుంచి మరో కీలక చర్య కూడా రావచ్చని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు.