దేశవ్యాప్తంగా కలకలం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇటీవల వివాహమైన రాజా రఘువంశీని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలైన భార్య సోనమ్ను పోలీసులు ఈస్ట్ కాశీ హిల్స్ ప్రాంతానికి తీసుకెళ్లారు.
సోహ్రా ప్రాంతంలో ఘటనా స్థలానికి నిందితులను తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు యత్నిస్తున్నారు.
డీజీపీ నాంగ్రాంగ్ మాట్లాడుతూ, ‘‘ఇది కేవలం ప్రేమ సంబంధమైన హత్యేనా? లేక ఇంకేదైనా కారణముందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. నిందితుల వాంగ్మూలాల్లో స్పష్టత లేకపోవడం, పలుచోట్ల విభిన్నంగా ఉండడం వల్ల నిజాలు బయటపడాలని ఆశిస్తున్నారు.
క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా నిందితుల పాత్రలు స్పష్టమవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా సోనమ్ చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
నిందితురాలు సోనమ్ను రేపు న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేసులో నిజాలు మరింత త్వరలో వెలుగు చూడనున్నాయి.