Tuesday, January 20, 2026
HomeAndhra Pradeshకైకలూరు రాజకీయాల్లో 'మార్పు' మొదలైందా? కొత్త స్కెచ్!

కైకలూరు రాజకీయాల్లో ‘మార్పు’ మొదలైందా? కొత్త స్కెచ్!

కృష్ణా జిల్లా: కైకలూరు నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుత ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీటుపై మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ కన్నేశారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గ సమీకరణాలు మారుతాయన్న అంచనాతో ఆయన పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

జయమంగళ వెంకటరమణ తన ఎమ్మెల్సీ సీటును త్యాగం చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీ అయ్యే ఆ సీటును పార్టీలోని ఇతర సీనియర్లకు కేటాయించి, ప్రతిఫలంగా వచ్చే ఎన్నికల్లో తనకు కైకలూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఆయన అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. నియోజకవర్గంలో తన అస్తిత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఆయన ఈ ‘బిగ్ ఆఫర్’ ఇచ్చారని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మరోవైపు, ప్రస్తుత ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్‌గా లేరనే విమర్శలు కూటమి పార్టీల్లో వినిపిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, స్థానిక సమస్యలపై పట్టు కోల్పోతున్నారనే అసంతృప్తి జనాల్లో ఉంది. ఇదే విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని జయమంగళ చూస్తున్నారు. బీసీ కోటాలో టికెట్ దక్కించుకుంటే విజయం సులభమవుతుందని ఆయన ఆశిస్తున్నారు.

అయితే, ఈ సీటును బీజేపీ అంత సులభంగా వదులుకుంటుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కామినేని శ్రీనివాస్‌కు పార్టీ హైకమాండ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఆయనను తప్పించడం అంత తేలికైన విషయం కాదు. చంద్రబాబు నాయుడు ఈ సీట్ల సర్దుబాటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. జయమంగళ మాత్రం వచ్చే ఎన్నికల రేసులో నిలవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular