
ఇజ్రాయెల్: గాజాలో ఉద్రిక్తతలు మరింత ముదిరుతున్నాయి. గురువారం రాత్రి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ పది వరుస వైమానిక దాడులు జరిపింది.
ఈ దాడుల్లో 54 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. మృతులను నాజర్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గాయపడ్డవారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
ఇదే సమయంలో, బుధవారం జరిగిన మరో దాడిలో 70 మంది ప్రాణాలు కోల్పోగా, అందులో 22 మంది చిన్నారులున్నారని సమాచారం. వరుస దాడులతో గాజాలో ప్రజల భయాందోళనలు తారాస్థాయికి చేరాయి. ప్రజలు రక్షణ కోసం సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
ఇజ్రాయెల్ చర్యలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. గాజా సమస్యకు శాంతియుత పరిష్కారం అవసరమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ట్రంప్ పర్యటన కాల్పుల విరమణ ఒప్పందానికి దోహదపడుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఆయన పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మానవతా సహాయ చర్యలపై అమెరికా చర్యలు తీసుకుంటుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది.