న్యూస్ డెస్క్: భారతదేశం పాకిస్తాన్ మధ్య గత కొంతకాలంగా పెరిగిన ఉద్రిక్తతలపై ఆశాజనక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రకారం, ఇరు దేశాలు తక్షణంగా పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి.
ఈ నిర్ణయం తీసుకోవడంలో అమెరికా కీలకంగా మధ్యవర్తిత్వం వహించింది. ట్రంప్ తన సోషల్ వేదికలో ఈ అప్డేట్ పంచుకుంటూ, ఇరు దేశాల నాయకత్వాన్ని ప్రశంసించారు.
ఆయన ప్రకారం, రాత్రంతా సాగిన చర్చలు విజయవంతమయ్యాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆయన పేర్కొన్నట్లు, పాకిస్థాన్ ఎప్పుడూ తన సార్వభౌమాధికారంపై రాజీ పడకుండానే ప్రాంతీయ శాంతి కోసం కృషి చేస్తోంది.
అంతకుముందు, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ చర్చలలో కీలకంగా పాల్గొన్నారు. ఇరు దేశాల నాయకులతో సహా, ఇతర ఉన్నతాధికారులతో 48 గంటలుగా చర్చలు జరిపినట్లు రూబియో తెలిపారు.
ఇరు దేశాలు తటస్థ వేదికపై మరిన్ని సమస్యలపై చర్చలు ప్రారంభించడానికి కూడా సిద్ధమయ్యాయని అమెరికా ప్రకటించింది. అయితే, అధికారికంగా భారత్ మరియు పాకిస్థాన్ ప్రభుత్వాల ప్రకటనలు ఇంకా రావాల్సి ఉంది.