
న్యూస్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఆమె నివాసంలోనే ఓ వ్యక్తి దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో అలజడి రేగింది. సీఎం రేఖా గుప్తా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, వ్యక్తిగత దాడులు అంగీకారయోగ్యం కాదని అన్నారు.
ప్రతిరోజూ ‘ప్రజలతో సీఎం’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్న రేఖా గుప్తా, ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి ఫిర్యాదు ఇచ్చే నెపంతో ఆమెకు అతి సమీపం నుంచి దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె తృటిలో తప్పించుకోగా, పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై ముఖ్యమంత్రి నివాసం వద్ద భద్రతను మరింత పెంచారు. పరిసర ప్రాంతాల్లో కూడా బలగాలు మోహరించారు. దాడి వెనుక ఉద్దేశం ఏమిటో ఇంకా వెల్లడించలేదు.
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యమంత్రికి మరింత భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర బలగాలను కూడా వినియోగించాలని సూచించారు.
ఈ దాడితో దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల భద్రతా అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు తరచూ ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి కూడా అధిక భద్రత అవసరమని నిపుణులు అంటున్నారు.
