
ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వం రాష్ట్ర జనాభా పెంపుదలపై కీలకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలో పిల్లల సంఖ్య పెంచేలా ప్రజలను ప్రోత్సహించేందుకు కొత్త విధానాలు రూపొందిస్తోంది. ముఖ్యంగా కేంద్ర నిధుల కేటాయింపు జనాభా ఆధారంగా జరిగే నేపథ్యంలో, సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని ముఖ్యంగా చర్చించారు. జనాభా పెంపుదలకు ప్రజల్లో చైతన్యం రావాలంటే ఆర్థిక ప్రోత్సాహాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా, మూడో బిడ్డ నుంచి ప్రతి పిల్లకూ 50 వేల రూపాయల ప్రోత్సాహాన్ని కుటుంబ ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ఆస్తి పన్ను మినహాయింపు, మహిళలకు ఏడాది పాటు ప్రసూతి సెలవు, పురుషులకు కూడా 6-8 నెలలపాటు కుటుంబ నిర్వహణ సెలవులు ఇవ్వాలని భావిస్తున్నారు. బాలింతలకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించనున్నారు.
ముగ్గురికి మించిన పిల్లలు ఉన్న తల్లులకు ఐదేళ్ల పాటు ఉచిత ఆర్టీసీ లగ్జరీ బస్ పాస్ కూడా ఇవ్వనున్నారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కనేవారికి కూడా ప్రోత్సాహం అందించనున్నారు.
ఈ విధానం ద్వారా రాష్ట్రంలో జనాభా పెంపుదలతో పాటు కుటుంబ సంక్షేమం, మహిళా ఉద్యోగులకు మద్దతుగా ప్రభుత్వం ముందుకు వస్తోంది. పౌరులకు ఈ ప్రోత్సాహకాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
