
ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తన పార్టీ ఎమ్మెల్యేలపై కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఒకే రోజు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు వివాదాల్లో రావడంతో బాబు ఢిల్లీలో ఉన్నప్పటికీ వెంటనే నివేదికలు అందించాలని ఆదేశించారు.
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే నసీర్ వివాహేతర బంధం ఆరోపణలతో పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక మహిళను బెదిరించిన వీడియో బయటకు రావడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నసీర్ ప్రవర్తన పార్టీకి మైనస్గా మారిందని నేతలు భావిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. తన పరిధిలోని ఓ మహిళా ఉద్యోగికి రాత్రిపూట ఫోన్ చేసి అసభ్యకరమైన డిమాండ్లు చేశారన్న ఆరోపణలు బయటపడ్డాయి. దీంతో ఆయనపై స్థానికంగా ప్రతికూల వాతావరణం ఏర్పడింది.
ఇక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలతో మరింత వివాదంలో చిక్కుకున్నారు. తారక్ అభిమానులు ఆగ్రహంతో ఆయన కార్యాలయానికి చేరుకుని ఫ్లెక్సీలు చించేశారు. సోషల్ మీడియాలో ఆయన ఆడియోలు వైరల్ కావడంతో సమస్య మరింత పెరిగింది.
ఈ పరిణామాలపై నివేదికలు రావాలని బాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నివేదికలు అందిన తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు సంకేతం ఇచ్చారు. ఈ నిర్ణయం టీడీపీ భవిష్యత్తు ఇమేజ్ను కాపాడడానికే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
