
న్యూస్ డెస్క్: రాజధాని అమరావతిలో కృష్ణా నదిపై నిర్మించబోయే ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ కోసం ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని కోరుతోంది. ఇప్పటికే నాలుగు డిజైన్లు సిద్ధం చేసి, వాటిలో ఏది బెటర్ అన్నది ప్రజలే నిర్ణయించాలి అని సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ బ్రిడ్జ్ అమరావతిని విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారితో అనుసంధానించే ప్రధాన రహదారిపై నిర్మించనున్నారు.
కొత్తగా రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5 కి.మీ. మేర ఈ వంతెన నిర్మాణం జరగనుంది. ఇప్పటికే ఉన్న బ్రిడ్జ్కు తోడు ఇది కూడా అమరావతికి పర్యాటక ఆకర్షణగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ డిజైన్లలో కూచిపూడి నృత్య హస్తముద్రలను ప్రతిబింబించే రూపకల్పనలు ఉండటం విశేషం. ఒక డిజైన్ ‘A’ ఆకారంలో ఉండి రాజధానిని సూచిస్తుండగా, మరొకటి కపోత ముద్ర శైలిలో ఉంది. ప్రజలు సీఆర్డీఏ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో ఓటు వేసే విధానం అందుబాటులో ఉంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాకుండా ఆంధ్ర సంస్కృతి ప్రతిబింబం కూడా వెలుగులోకి రానుంది. ఏ డిజైన్ ఫైనల్ అవుతుందో చూడాలి.
