
న్యూస్ డెస్క్: విశాఖ నగరం మరింతగా అభివృద్ధి చెందనుందని, అత్యాధునిక సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తాజాగా చేసిన ట్వీట్ ద్వారా హామీ ఇచ్చారు.
బెంగళూరుతో పోలిక.. సీఎం స్పందన
విశాఖను బెంగళూరుతో పోలుస్తూ ఒక సంస్థ ఇటీవల కితాబు ఇచ్చింది. బెంగళూరు కంటే కూడా విశాఖ చాలా విషయాలలో మెరుగ్గా ఉందని ఆ సంస్థ పోలిక తెచ్చింది. విశాఖలో ఉన్న పచ్చదనం ఫుట్పాత్లపై పొగడ్తలు కురిపించింది.
ఈ నేపథ్యంలో, ‘సివిక్ అప్పోజిషన్ ఆఫ్ ఇండియా’ అనే సంస్థ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్లకు ఒక కీలక సూచన చేసింది. విశాఖలో సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆ సంస్థ అభిప్రాయపడింది. దీనికి సీఎం చంద్రబాబు వెంటనే రియాక్ట్ అయ్యారు. తప్పకుండా విశాఖలో ఆధునిక సైక్లింగ్ ట్రాక్స్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
విశాఖ ఫ్యూచర్ ఐటీ హబ్
సరైన సదుపాయాలు మౌలిక వసతులు కల్పిస్తే కనుక, విశాఖ తప్పకుండా బెంగళూరు తరువాత మంచి ఐటీ హబ్గా మారుతుందని సివిక్ అప్పోజిషన్ ఆఫ్ ఇండియా సంస్థ అభిప్రాయపడింది. ఆ దిశగా విశాఖను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వానికి వినతి చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పోస్టులకు పాజిటివ్గా రియాక్ట్ అవుతూనే, విశాఖను అన్ని విధాలుగా మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ అందాలు సహజసిద్ధమైన ప్రకృతి నగరవాసులకు పర్యాటకులకు మంచి అనుభూతిని అందిస్తోందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగ్గా మారుస్తామని కూడా ఆయన వెల్లడించారు.
