
న్యూస్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ సుమారు 140 రోజుల అనంతరం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బైటికి రాగలిగారు.
వంశీపై కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 16న హైదరాబాద్లో ఆయనను ఏపీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
అప్పటి నుంచి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వంశీ, తన అరెస్టుపై న్యాయపోరాటం చేస్తూ బెయిల్కు ప్రయత్నించారు. తాజాగా నూజివీడు కోర్టు బెయిల్ను మంజూరు చేసింది.
కోర్టు విధించిన షరతుల మేరకు వంశీ విడుదలకు మార్గం సుగమమైంది. దీంతో ఆయన విజయవాడ సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు.
విజయవాడ జైలు వద్ద వంశీ విడుదల సందర్భంగా వైసీపీ నేతలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భార్య పంకజ శ్రీ, పేర్ని నాని, తలశిల రఘురాం తదితరులు హాజరయ్యారు.
పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకుని నినాదాలతో వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.