
పెద్దపల్లి: తెలంగాణలో ఆన్లైన్ లోన్ యాప్ వ్యవహారం మరో వ్యక్తి ప్రాణాలు తీసింది. ఆర్హిక సమస్యలతో అవసరానికి అప్పులు తీసుకున్న వ్యక్తిని సదరు యాప్స్ నిర్వాహకులు అదే పనిగా వేధించడంతో బాధితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలో కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది.
విశాఖపట్నానికి చెందిన సంతోష్కుమార్ రామగుండంలోని ఓ ఎరువుల కర్మాగారంలో సైట్ ఇంచార్జిగా పనిచేసేవాడు. మల్కాపూర్లో ఇల్లు అద్దెకు తీసుకునే ఉండేవాడు. ఈ మధ్య అనారోగ్య కారణాల వల్ల పరిస్థితి సరిగా లేకపోవడంతో సంతోష్ ఆర్థికంగా దెబ్బ తిన్నాడు. దీంతో యాప్ లోన్ ద్వారా అప్పు తీసుకున్నాడు. వాటిని వాయిదాల ప్రకారం చెల్లించసాగాడు.
తాజాగా అసలు, వడ్డీ ఒకేసారి చెల్లించాలని సదరు యాప్ల నిర్వాహకులు వేధించసాగారు. అసలే ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంతోష్ వారి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడే ముందు అతను సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోను తన ఫ్రెండ్ సుబ్రహ్మణ్యంకు పంపించాడు.
త్వరగా స్పందించిన సుబ్రహ్మణ్యం అతన్ని గోదావరిఖని ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. విశాఖపట్పం నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు సంతోష్ను మెరుగైన వైద్యం కోసం తనను వైజాగ్కు తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 23న మృతి చెందారు. సూసైడ్ సెల్ఫీ వీడియో ద్వారా సుబ్రహ్మణ్యం ఎన్టీపీసీ పోలీసులకు పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆయా యాప్ల యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అతని స్నేహితుడు సుబ్రహ్మణ్యం ఎన్టీపీసీ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని ఎన్టీపీసీ ఎస్సై స్వరూప్రాజ్ తెలిపారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.