
ఇంటర్నెట్ డెస్క్: టెక్ దిగ్గజం గూగుల్ మళ్లీ ఉద్యోగుల తొలగింపులతో వార్తల్లో నిలిచింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ వంటి ప్రధాన విభాగాల్లో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులను లేఆఫ్ చేసినట్టు సమాచారం.
ఈ విషయాన్ని ‘ది ఇన్ఫర్మేషన్’ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. తాజా లేఆఫ్స్ ప్రభావం ఎంత మందిపై పడిందనేది గూగుల్ స్పష్టంగా వెల్లడించలేదు. అయితే ఇందులో డైరెక్టర్లు, మేనేజర్లు, వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగులే ఉన్నట్లు తెలుస్తోంది.
సంస్థ గతంలోనూ ఈ తరహా లేఆఫ్స్కు పాల్పడిన సంగతి తెలిసిందే. 2023 జనవరిలో 12 వేల మందిని తొలగించగా, ఫిబ్రవరిలో క్లౌడ్, హెచ్ఆర్ విభాగాల్లోనూ ఉద్యోగులను బయటకు పంపింది.
కంపెనీ ఈ చర్యలను వ్యయ నియంత్రణ చర్యలుగా పేర్కొంది. గ్లోబల్ మార్కెట్లలో ఆర్థిక అస్థిరత, మాంద్య భయాలు, టారిఫ్ యుద్ధాలు, ఏఐ ఆధారిత పనితీరు పెరగడం వంటి అంశాలు గూగుల్ నిర్ణయానికి కారణాలుగా నిలిచాయి. గూగుల్ మాత్రమే కాదు, ఇతర ప్రముఖ టెక్ సంస్థలూ ఈ మార్గంలోనే నడుస్తున్నాయి.
తాజా లేఆఫ్స్ మరోసారి టెక్ ఉద్యోగుల్లో భయాలు రేకెత్తిస్తున్నాయి. భవిష్యత్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.