
ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగ అభివృద్ధికి భారీ అడుగు వేసింది. రూ.4.2 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు రాష్ట్రంలో తయారీ చేయడం, 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా నూతన ఎలక్ట్రానిక్ ఉత్పత్తి విధానాన్ని ప్రకటించింది. ఇది లక్షల మందికి ఉపాధిని అందించే కీలక నిర్ణయంగా నిలవనుంది.
పెట్టుబడి స్థాయిని బట్టి కంపెనీలకు వివిధ రకాల ప్రోత్సాహకాలు లభించనున్నాయి. స్టాంప్ డ్యూటీ పూర్తి మినహాయింపు, నియామకాలకు నెలకు రూ.4,000 నుంచి రూ.6,000 వరకు ఆర్థిక సహాయం ఇవ్వనున్నారు. అలాగే ఐదేళ్లపాటు విద్యుత్ను యూనిట్కు కేవలం రూ.1కే అందించనుంది.
విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు ఉన్నాయని ప్రభుత్వం గుర్తుచేసింది. ఇవి పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉండనున్నాయి. నైపుణ్యాలున్న యువత, రవాణా సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్ వంటివి కీలక పాత్ర పోషించనున్నాయి.
ఈ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.