
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది వైసీపీ ఎమ్మెల్సీల టీడీపీ చేరికలు. చాలాకాలం నుంచి వదంతులుగా వినిపిస్తున్న ఈ విషయం ఇప్పుడు అధికారికమైంది. బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ ముగ్గురు ఎమ్మెల్సీలు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు.
వైసీపీ నుంచి ఈ ముగ్గురు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. కానీ మండలి చైర్మన్ ఆమోదం ఆలస్యం చేయడంతో పార్టీలో చేరికలు కూడా వాయిదా పడ్డాయి. ఇప్పుడు చివరకు ముహూర్తం ఫిక్స్ అవడంతో టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరినట్టు తెలిపారు. ఇక బల్లి కల్యాణ్ “మా నాన్న జీవితాంతం టీడీపీతో ఉన్నారు, కాబట్టి మా చేరిక సొంత గూటికి వచ్చినట్టే” అని వ్యాఖ్యానించారు.
కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ, వైసీపీ పదవిలో ఉన్నా ప్రజలకు ఏం చేయలేకపోయామని, మీడియాతో కూడా మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ లో చేరడం ద్వారా తనకు ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ చేరికలతో గుంటూరు, గోదావరి, నెల్లూరు జిల్లాల్లో టీడీపీకి బలమైన మద్దతు లభిస్తుందని విశ్లేషకుల అంచనా. స్థానిక ఎన్నికలకు ముందే ఈ చేరికలు కూటమికి అదనపు బలాన్నిస్తాయని అంటున్నారు.
మొత్తం మీద జగన్కు ఇది పెద్ద షాక్గా మారగా, టీడీపీ వైపు వలసల వాతావరణం మళ్లీ మొదలైందనే సంకేతాలు ఇస్తోంది.
