ఏపీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు రాజా రెడ్డి భవిష్యత్తు రాజకీయ ప్రస్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాజా రెడ్డి తాత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తూ కడప జిల్లా నుంచే రాజకీయాల్లోకి వస్తాడని ఆమె తెలిపారు.
అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం రాజా రాజకీయాలపై అధ్యయనం చేస్తూ, సరైన సమయాన్ని ఎంచుకుంటాడని షర్మిల స్పష్టం చేశారు.
తాజాగా షర్మిల కర్నూలులోని ఉల్లి మార్కెట్ను సందర్శించి రైతుల సమస్యలు విన్నారు. ఉల్లిపాయలు అధికంగా దిగుబడి వచ్చినా, సరైన కొనుగోలు లేక రైతులు నష్టపోతున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు.
ప్రభుత్వమే క్వింటాకు రూ.1200 మద్దతు ధర ప్రకటించడం దారుణమని, కనీసం రూ.3000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పక్కన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నిలుస్తుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంలోనే షర్మిల తన కుమారుడు రాజా రాజకీయ ఎంట్రీపై వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. వైఎస్ కుటుంబం నుంచి కొత్త తరానికి చెందిన రాజా రెడ్డి ప్రవేశం కడపలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొత్త డైనమిక్స్ తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
