
న్యూస్ డెస్క్: విశాఖపట్నం ఐటీ హబ్లో సరికొత్త చరిత్రకు తెర లేవనుంది. ప్రపంచ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తో పాటు మరో 8 ప్రముఖ ఐటీ సంస్థలకు శుక్రవారం శంకుస్థాపనలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ హాజరు కానున్నారు.
ఈ తొమ్మిది సంస్థల్లో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం కూడా శుక్రవారమే ప్రారంభం కావడం విశేషం. టీసీఎస్ కంటే ముందే కాగ్నిజెంట్ తన సర్వీస్ సెంటర్ ను ప్రారంభిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు వేగంగా మంజూరు అవుతుండటంతో పరిశ్రమలు తరలివస్తున్నాయి.
కాపులుప్పాడలో కాగ్నిజెంట్ కు ప్రభుత్వం 22.19 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో రూ.1580 కోట్లతో ఏఐ టెక్నాలజీ సెంటర్ ను నిర్మించనుంది. ఈ సెంటర్ ద్వారా దాదాపు 8 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
మంత్రి లోకేశ్ రుషికొండలోని ఐటీ పార్కులో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత శ్రీటెక్, నాన్ రెల్ టెక్నాలజీస్, ఏసీఎన్ ఇన్ఫోటెక్, సత్వాస్ వంటి సంస్థలకు భూమి పూజ చేస్తారు. మదర్ సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ సంస్థల శిలాఫలకాలు కూడా ఆవిష్కరిస్తారు.
ఈ తొమ్మిది ఐటీ సంస్థల రాకతో విశాఖకు అదనంగా 50 వేల ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు వెంటనే తాత్కాలిక భవనాల్లో కార్యాలయాలు ప్రారంభిస్తుండటం వల్ల మిగిలిన సంస్థలు కూడా వేగంగా తమ సేవలు ప్రారంభించడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.
