
న్యూస్ డెస్క్: రాజకీయాల్లో మాటలు చెప్పేవారు కోకొల్లలు, కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవారే నిజమైన నాయకులు. ఈ కోవలోనే, తమిళ నటుడు, తమిళగ వెట్రీ కజగం (టీవీకే) అధినేత విజయ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కరూర్ ర్యాలీలో జరిగిన బాధితులకు అండగా నిలుస్తానని ఇచ్చిన హామీని, కేవలం మూడు వారాల్లోనే 95% పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు.
కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విజయ్, మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం కంటే రెట్టింపుగా, రూ. 20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. అన్న మాట ప్రకారం, ఇప్పటివరకు 39 కుటుంబాలకు తలా రూ. 20 లక్షల చొప్పున, మొత్తం రూ. 7.8 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు.
విధానపరమైన కారణాల వల్ల మరో రెండు కుటుంబాలకు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని, వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భారీ ఆర్థిక సాయంతో పాటు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు, వైద్య ఖర్చులు కూడా అందిస్తామని విజయ్ హామీ ఇచ్చారు.
ఇది కేవలం తక్షణ సహాయం మాత్రమే కాదు, ఆ కుటుంబాలకు దీర్ఘకాలిక భరోసా కల్పించేందుకు కూడా టీవీకే నడుం బిగించింది. మృతుల కుటుంబాలకు నెలనెలా రూ. 5 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు, వారి పిల్లల విద్య, ఉపాధి అవకాశాలలోనూ అండగా ఉంటామని ప్రకటించింది.
ఈ విషాదానికి గుర్తుగా, ఈ ఏడాది దీపావళి వేడుకలను జరుపుకోవద్దని విజయ్ తన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. బాధితుల కుటుంబాల శోకంలో పాలుపంచుకోవాలని, వారికి నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఒకవైపు ఆర్థికంగా ఆదుకుంటూ, మరోవైపు నైతికంగా అండగా నిలుస్తూ విజయ్ తీసుకుంటున్న చర్యలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, చేతల్లో తన మానవత్వాన్ని, బాధ్యతను చాటుకుంటూ విజయ్ నిజమైన నాయకుడిగా నిలుస్తున్నారు.
