
న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వస్తువులపై 50 శాతం సుంకాలు విధించడంపై అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చ మొదలైంది. అధికారికంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందనే కారణం చూపుతున్నా, దీని వెనుక అసలు ఉద్దేశం రాజకీయ అహమని విశ్లేషకులు అంటున్నారు.
“ఆపరేషన్ సిందూర్” అనంతరం పాకిస్థాన్ కాల్పుల విరమణ కోరిన సమయంలో ట్రంప్ తనే శాంతి చర్చలు కుదిర్చానని చెప్పుకోవడం భారత్ను అసహనానికి గురిచేసింది. దీనిపై భారత్ స్పష్టంగా అభ్యంతరం చెప్పడంతో ట్రంప్ ఆగ్రహం పెరిగిందని విదేశీ మీడియా పేర్కొంటోంది. ఈ కారణంగానే ఇప్పుడు భారత్ను లక్ష్యంగా చేసుకున్నారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ఇక, పాకిస్థాన్ మాత్రం ట్రంప్ వైపు నిలిచి ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కూడా సిఫార్సు చేసింది. ఇది ట్రంప్ అహంకారాన్ని మరింత పెంచి భారత్పై ప్రతీకార భావనకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నదని సుంకం విధించినా, ఇదే సమయంలో చైనా, యూరప్ దేశాలు కూడా భారీగా రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకున్నాయి. అయినప్పటికీ వారిపై అమెరికా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం ద్వంద్వ వైఖరి అని విమర్శలు వస్తున్నాయి.
ఈ సుంకాల వల్ల భారత్ ఎగుమతులు పెద్దగా దెబ్బతింటాయనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆర్థికపరమైన కారణాల కంటే, ప్రపంచానికి తన అధికారం చూపించాలనే ట్రంప్ ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
మొత్తానికి ఈ నిర్ణయం వాణిజ్య యుద్ధం కంటే, రాజకీయ ప్రతీకారానికి దగ్గరగా ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
