
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా విధానంపై తన వ్యూహాన్ని స్పష్టం చేసింది. అమెరికాకు విదేశీ నైపుణ్యం అవసరమని అంగీకరిస్తూనే, అది కేవలం ‘నాలెడ్జ్ ట్రాన్స్ఫర్’ (జ్ఞాన బదిలీ) కోసం మాత్రమేనని, శాశ్వతం కాదని తేల్చిచెప్పింది.
ఈ కొత్త విధానంపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “అమెరికన్లకు శిక్షణ ఇవ్వడానికే విదేశీ కార్మికులను తాత్కాలికంగా తీసుకురావడమే మా లక్ష్యం. ఆ శిక్షణ పూర్తయ్యాక, వారు తిరిగి వెళ్లిపోవాలి. అంతిమంగా ఆ ఉద్యోగాలన్నీ అమెరికన్లకే దక్కాలి” అని ఆయన స్పష్టం చేశారు.
సెమీకండక్టర్, రక్షణ, అధునాతన తయారీ రంగాల్లో అమెరికా నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటోంది. ఈ కీలక రంగాల్లో అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకే విదేశీ నిపుణుల అవసరం ఉందని బెసెంట్ వివరించారు.
గతంలో హెచ్-1బీపై కఠినంగా ఉన్న ట్రంప్ కూడా ఇటీవల స్వరం మార్చారు. “నిరుద్యోగుల లైన్లో ఉన్నవారిని పిలిచి క్షిపణులు తయారు చేయమని చెప్పలేం” అంటూ, సాంకేతిక నైపుణ్యం కోసం విదేశీయుల అవసరాన్ని పరోక్షంగా అంగీకరించారు.
అయితే, వీసా కార్యక్రమాలు పూర్తిగా నిలిపివేయడం లేదని, భద్రతా తనిఖీలు (సెక్యూరిటీ వెట్టింగ్) యథావిధిగా కొనసాగుతాయని హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టి నోయమ్ స్పష్టం చేశారు.
ఈ కొత్త విధానం హెచ్-1బీని శాశ్వత నివాస మార్గంలా కాకుండా, ‘తాత్కాలిక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్’ ప్రోగ్రామ్గా మారుస్తోంది. ఇది భారతీయ ఐటీ నిపుణుల దీర్ఘకాలిక ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
