న్యూస్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించి, ఉజ్వల భవిష్యత్తుకు సిద్ధమవుతున్న మరో తెలుగు విద్యార్థిని కలలు కల్లలయ్యాయి. అనారోగ్యం రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) ఈ విషాదాంతంలో మరణించారు. విజయవాడలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె, 2023లో ఎంఎస్ కంప్యూటర్స్ కోసం అమెరికా వెళ్లారు.
ఇటీవలే రాజ్యలక్ష్మి తన చదువును విజయవంతంగా పూర్తి చేశారు. స్నేహితులతో కలిసి ఉంటూ, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. కొద్ది రోజుల్లో మంచి ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి ఆసరాగా నిలుస్తుందని ఆశించిన తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి.
మరణించడానికి ముందు రోజు రాత్రి (గురువారం) రాజ్యలక్ష్మి తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. తనకు కొద్దిగా జలుబు, ఆయాసంగా ఉందని, అందుకే నవంబర్ 9న డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానని తెలిపారు.
స్నేహితులతో కలిసి నిద్రపోయిన ఆమె, మరుసటి రోజు ఉదయం ఎంతకూ లేవలేదు. స్నేహితులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె నిద్రలోనే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ హఠాత్పరిణామంతో ఆమె తల్లిదండ్రులు రామకృష్ణ, నాగమణి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏపీ ఎమ్మెల్యే సాంబశివరావు ప్రభుత్వ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నారైలు సైతం స్పందించి, ఆ కుటుంబానికి అండగా లక్ష డాలర్లకు పైగా నిధిని సేకరించారు.
