
న్యూస్ డెస్క్: తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ఇప్పుడు సంక్రాంతి సినిమాల నేపథ్యంలో మళ్లీ హాట్ టాపిక్ అయింది. గతంలో ‘పుష్ప 2’ సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాట తర్వాత ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపు స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వమని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, గతంలో ‘ఓజీ’ ‘అఖండ 2 తాండవం’ వంటి సినిమాలకు అనుమతులు ఇచ్చినా, హైకోర్టు కొన్ని గంటల ముందు ప్రీమియర్లను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకపై టిక్కెట్ రేట్లు పెంచమని ఎవరూ తమ వద్దకు రావొద్దని, ఎలాంటి అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు.
మంత్రి ప్రకటన నేపథ్యంలో సంక్రాంతికి రానున్న పెద్ద సినిమాల నిర్మాతలు లాస్ అవుతారా అనే చర్చ మొదలైంది. అయితే, పొంగల్కు వస్తున్న కొన్ని మూవీల నిర్మాతలు మాత్రం ప్రభుత్వం ఛాన్స్ ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ, తమ సినిమాకు టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము కేవలం మూడు రోజులకే రూ.50-70 వరకు పెంచాలని అనుకుంటున్నామని తెలిపారు.
- ‘ది రాజా సాబ్’ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తామని, అప్పుడు ప్రభుత్వం చెప్పే దానిని బట్టి తమ ప్లాన్ ఉంటుందని పేర్కొన్నారు.
మంత్రి స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ, పెద్ద సినిమాల నిర్మాతలు మాత్రం రేట్ల పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతి చిత్రాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
