
న్యూస్ డెస్క్: తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ ఎప్పుడూ చెప్పుకునేది. కానీ తాజాగా తీసుకున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్ణయం మాత్రం పెద్ద చర్చకు దారి తీసింది. తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ జడ్జి బి.సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నా, బీఆర్ఎస్ తాము ఎన్నికల నుండి తప్పుకుంటున్నామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు లేవనెత్తుతోంది.
2010లో లోక్సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. “మేము ఎంత మంది ఉన్నామన్నది ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల గొంతు వినిపిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం” అని అప్పట్లో ఆయన స్పష్టం చేశారు.
అప్పట్లో విజయశాంతి, కేసీఆర్ ఇద్దరే ఉన్నా తెలంగాణ ప్రజల తరపున బలంగా పోరాడిన విషయాన్ని అందరూ గుర్తు చేస్తున్నారు.
అలాంటి నేత ఇప్పుడు తెలంగాణ వ్యక్తి పోటీ చేస్తున్న ఎన్నికల నుంచి వెనక్కు తగ్గడం సమాజాన్ని అవమానించినట్టే కాదా? అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. గెలుపు-ఓటములు పక్కన పెడితే, పోరాడామా లేదా అన్నది ప్రధాన అంశమని విమర్శకులు చెబుతున్నారు.
కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం లేదన్నా, తెలంగాణ అభ్యర్థిని పట్టించుకోకపోవడం రాజకీయంగా కాంగ్రెస్కు లాభం చేకూర్చవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఒకప్పుడు ఎన్టీఆర్, పీవీ నరసింహారావు ప్రధానమంత్రి పదవి కోసం పోటీలో ఉన్నప్పుడు తాము తప్పుకున్న విషయాన్ని కూడా కొందరు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఆ స్ఫూర్తి ఎందుకు కనపడలేదన్నది కీలక ప్రశ్నగా మారింది.
