
న్యూస్ డెస్క్: భారత సైన్యం, దేశ భద్రతపై చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు తీవ్ర గట్టి హెచ్చరిక ఇచ్చింది. “నిజమైన భారతీయులైతే అలాంటి వ్యాఖ్యలు చేయరు” అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఓ రిటైర్డ్ రక్షణ అధికారి లక్నో కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఈ కేసును రద్దు చేయాలంటూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్పై సోమవారం విచారణ చేసిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్ ధర్మాసనం, లక్నో కోర్టులో కేసు విచారణపై తాత్కాలికంగా స్టే విధించింది. అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యల తీరుపై తీవ్ర విమర్శలు చేసింది.
“మీరు ప్రతిపక్ష నేత. పార్లమెంటులో చర్చించాల్సిన విషయాలను సోషల్ మీడియాలో ఎందుకు ప్రస్తావిస్తారు? చైనా 2,000 చదరపు కిలోమీటర్ల భూమి ఆక్రమించిందని మీకు ఎక్కడి సమాచారం?” అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
జాతీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భద్రతా విషయాల్లో ప్రజల్లో భయం కలిగించేలా వ్యాఖ్యానించకూడదని సూచించింది.
