
న్యూస్ డెస్క్: టీమిండియా యువ కెరటం, ఇటీవల వన్డే వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో అద్భుత ఫామ్తో ఆకట్టుకున్న అయ్యర్, సిడ్నీలో జరిగిన చివరి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
సిడ్నీ మ్యాచ్ సందర్భంగా, ఓ కీలక క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అయ్యర్ కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతని పక్కటెముకలకు బలమైన దెబ్బ తగిలినట్లు, అంతర్గత రక్తస్రావం కూడా అయినట్లు విశ్వసనీయ సమాచారం. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో, మ్యాచ్ అనంతరం వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి, ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
అయితే, అయ్యర్ గాయాలు తీవ్రమైనవే అయినప్పటికీ, ప్రాణాపాయం ఏమీ లేదని టీమ్ వర్గాలు స్పష్టం చేశాయి. వైద్యులు అతనికి పూర్తి విశ్రాంతిని సూచించినట్లు తెలుస్తోంది. బీసీసీఐ వైద్య బృందం, టీమ్ మేనేజ్మెంట్ అతని ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. త్వరలోనే కోలుకుని జట్టులోకి తిరిగి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వెస్టిండీస్, ఆసియా కప్ సిరీస్లకు దూరమైన అయ్యర్, ఆస్ట్రేలియా సిరీస్తోనే జట్టులోకి పునరాగమనం చేశాడు. రెండో వన్డేలో కీలక హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అతని నిలకడైన ప్రదర్శనతోనే బీసీసీఐ అతనికి వన్డే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ సిరీస్లో విఫలమైన వేళ, అయ్యర్ ప్రదర్శన జట్టుకు కీలకంగా మారింది.
ఇలాంటి కీలక సమయంలో అయ్యర్ గాయపడటం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ‘#GetWellSoonShreyas’ హ్యాష్ట్యాగ్తో వేలాది మంది అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలను బీసీసీఐ త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. కెరీర్లో మంచి ఫామ్లో ఉన్న అయ్యర్, త్వరగా కోలుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాలని యావత్ క్రికెట్ ప్రపంచం ఆకాంక్షిస్తోంది.
